రుద్రమ్-2 యాంటీ రేడియేషన్ మిసైల్ పరీక్ష విజయవంతం

దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి యాంటీ రేడియేషన్ మిసైల్ రుద్రమ్-2 ను డీఆర్‌డీఓ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. మిసైల్ చోదక వ్యవస్థ, నియంత్రణ, మార్గదర్శక వ్యవస్థలు ఆశించిన రీతిలో పనిచేశాయని డీఆర్‌డీఓ నెట్టింట పేర్కొంది. సు-30 ఎమ్‌కే-1 నుంచి ఈ మిసైల్ ను ప్రయోగించారు. ధ్వని వేగానికి రెండు రెట్ల స్పీడుతో క్షిపణి ప్రయాణిస్తుందని డీఆర్‌డీఓ పేర్కొంది. శత్రుదేశాల రాడార్, కమ్యూనికేషన్, గగనతల రక్షణ వ్యవస్థలను రుద్రమ్ ధ్వంసం చేయగలదు. దీర్ఘశ్రేణి యాంటీ రేడియేషన్ మిసైళ్లను భారత్ అభివృద్ధి చేయగలదన్న విషయాన్ని రుద్రమ్ రుజువు చేసిందని నిపుణులు చెబుతున్నారు. 

మూడేళ్ల క్రితం డీఆర్‌డీఓ.. తొలి తరం రుద్రమ్ మిసైల్‌ను పరీక్షించింది. రేడియేషన్ వెలువరించే వ్యవస్థలను ఈ మిసైల్ గుర్తించి, నిర్వీర్యం చేస్తుందని డీఆర్‌డీఓ పేర్కొంది. 

రుద్రమ్ పరీక్ష విజయవంతం కావడంపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఇదో అద్భుత విజయమని వ్యాఖ్యానించారు.

Rudram-2
DRDO
Anti Radiation Missile

More Telugu News